వెండితెరపై ధ్యాన్‌చంద్‌ 

16 Dec, 2020 08:01 IST|Sakshi

ముంబై : క్రికెటర్లు ధోని, సచిన్‌ టెండూల్కర్‌... అథ్లెట్‌ మిల్కా సింగ్‌... బాక్సర్‌ మేరీకోమ్‌... హాకీ ప్లేయర్‌ సందీప్‌ సింగ్‌లపై ఇప్పటికే బయోపిక్‌లు వచ్చా యి. మైదానంలో ఆడిన ఆట మలీ్టప్లెక్స్, సినిమా తెరలపై కూడా ఆడింది. కానీ వీరందరికంటే ముందు అసాధారణ ఆటతో భారత్‌ను గెలిపించి, మువ్వన్నెలను మురిపించి, నియంతలనే మెప్పించిన హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ‘షో’ వెండితెరపై వెనుకబడింది. అయితే ఇప్పుడు ఆ ముచ్చట కూడా త్వరలోనే తీరనుంది.

బాలీవుడ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ చౌబే భారత హాకీ లెజెండ్‌పై బయోపిక్‌ రూపొందించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. అన్నట్లు ఈ చిత్రం పేరు మన లెజెండ్‌ హీరో పేరే... ‘ధ్యాన్‌చంద్‌’. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్, బ్లూ మంకీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రనిర్మాణం చేపట్టినట్లు దర్శకుడు తెలిపారు. వచ్చే ఏడాది సెట్స్‌పై లైట్స్‌... కెమెరా... యాక్షన్‌... అంటూ రూపుదిద్దుకోనుంది. 2022లో విడుదల కానుంది. భారత హాకీ చరిత్రనే ‘స్వర్ణ’ అక్షరాలతో లిఖించిన మూడు ఒలింపిక్స్‌ (1928–అమ్‌స్టర్‌డామ్‌), (1932 –లాస్‌ఏంజెలిస్‌), (1936– బెర్లిన్‌) ప్రదర్శనలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అయితే తెరపై ఎవరా ‘ధ్యాన్‌చంద్‌’ అంటే కొన్నాళ్లు నిరీక్షించాలి. స్టార్‌ హీరోతోనే ఈ చిత్రం ఉంటుందని సమాచారం.  

మరిన్ని వార్తలు