Chetan Sharma: కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాల గురించి విని నవ్వుకునేవాడిని..

1 Jan, 2022 16:17 IST|Sakshi

ముంబై: టీమండియా టెస్ట్‌ సారధి విరాట్‌ కోహ్లి, పరిమిత ఓవర్ల రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మల మధ్య విభేదాలు నెలకొన్నాయని, అందువల్లే కోహ్లి వన్డే కెప్టెన్సీని సైతం రోహిత్‌కు కోల్పోవాల్సి వచ్చిందని.. గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో భారత జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ తాజాగా స్పందించాడు. కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న​ ప్రచారం అవాస్తవమని, అవన్నీ పనిలేని వ్యక్తులు పుట్టించే పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు. కొన్ని సందర్భాల్లో అలాంటి వార్తలు విని తనలో తాను నవ్వుకునేవాడినని చెప్పుకొచ్చాడు.

వాస్తవానికి కోహ్లి-రోహిత్‌లు చాలా సన్నిహితంగా ఉంటారని, జట్టుకు సంబంధించిన అన్ని విషయాలు కలిసి చర్చిస్తారని, ఒకరి సారధ్యంలో మరొకరు ఆడేందుకు ఏమాత్రం సంకోచించరని, ఈ విషయాన్ని కోహ్లినే స్వయంగా వెల్లడించాడని గుర్తు చేశాడు. టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోకూడదని తామందరమూ కోహ్లిని కోరామని, అయినా అతను మా మాటలను పట్టించుకోలేదని వాపోయాడు. 

పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతోనే వన్డే సారధ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాల్సి వచ్చిందని వివరించాడు. భవిష్యత్తులో కోహ్లి-రోహిత్‌లు ఒకరి సారధ్యంలో మరొకరు కలిసి ఆడతారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారిద్దరూ ఒకే కుటుంబంలా కలిసుంటారంటూ కోహ్లి-రోహిత్‌ల ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన అనంతరం చేతన్‌ శర్మ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 
చదవండి: 'కోహ్లి మాటల్లో నిజం లేదు..' చేతన్‌ శర్మ కౌంటర్‌
 

మరిన్ని వార్తలు