సురేష్‌ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం

29 Aug, 2020 20:39 IST|Sakshi

టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐపీఎల్‌ పర్యటన నిమిత్తం యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌‌ రైనా‌ ఉన్నపళంగా ఇంటిముఖం పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే దీని వెనుక ఓ బలమైన కారణమే ఉందని అందరూ భావించారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్‌ విషయం బయటపడింది. రైనా మామ (మేనత్త భర్త)‌ అశోక్‌ కుమార్‌ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. గుర్తుతెలియని దుండుగుల దాడిలో అశోక్‌ ప్రాణాలు కోల్పోగా నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడినట్లు పంజాబ్‌లోని పఠాన్‌కోటా పోలీసులు శనివారం సాయంత్రం తెలిపారు. (చెన్నైకి భారీ షాక్‌.. ఐపీఎల్‌ నుంచి రైనా ఔట్‌)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌కోటా సమీపంలోని మదోపూర్‌ గ్రామంలోని రైనా మేనత్త కుటుంబం నివసిస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది దుండుగులు వారి ఇంట్లో దోపిడికి ప్రయత్నించారు. అయితే వారిపై అశోక్‌తో పాటు కుటుంబ సభ్యులు తిరగబడంతో బలమైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందగా.. కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వ్యక్తి ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇక ఐపీఎల్‌ను రద్దు చేసుకుని భారత్‌కు తిరుగు ప్రయాణం అయిన సురేష్‌ రైనా అశోక్‌ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నాడు. (కరోనా ఎఫెక్ట్‌ : ఆలస్యం కానున్న ఐపీఎల్‌!)

>
మరిన్ని వార్తలు