Arshdeep Singh: ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్‌దీప్‌ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు

27 Jan, 2023 21:24 IST|Sakshi

న్యూజిలాండ్‌తో తొలి టి20లో టీమిండియా బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ చెత్త బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచాడు. 4 ఓవర్లు వేసిన అర్ష్‌దీప్‌ ఒక్క వికెట్‌ మాత్రమే తీసి 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక చివరి ఓవర్లో డారిల్‌ మిచెల్‌ అర్ష్‌దీప్‌కు చుక్కుల చూపించాడు. అతను వేసిన ఒకే ఓవర్లో 27 పరుగులు పిండుకున్నాడు. ఓవర్‌ తొలి బంతినే అర్ష్‌దీప్‌ నోబాల్‌ వేయగా డారిల్‌ మిచెల్‌ సిక్సర్‌ బాదాడు.

 ఆ తర్వాత బంతిని డీప్‌ బాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌ దిశగా బాదాడు.  ఇక ఓవర్‌ రెండో బంతిని లాంగాన్‌ దిశగా కొట్టి హ్యాట్రిక్‌ సిక్సర్లు పూర్తి చేశాడు. అప్పటికే 18 పరుగులు రావడంతో అర్ష్‌దీప్‌ ఒత్తిడితో మూడో బంతి వేయగా.. మిచెల్‌ దానిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత నాలుగు పరుగులు రావడంతో మొత్తంగా 27 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో 149గా ఉన్న స్కోరు 20 ఓవర్లు ముగిసేసరికి 177గా మారిపోయింది.

ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ తన పేరిట ఒక చెత్త రికార్డు లిఖించుకున్నాడు. టి20ల్లో అత్యధిక నోబాల్స్‌ వేసిన బౌలర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్‌ 22 మ్యాచ్‌ల్లో 14 నోబాల్స్‌తో తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత హసన్‌ అలీ 11 నోబాల్స్‌ (50 మ్యాచ్‌లు) , కీమో పాల్‌ 11 నో బాల్స్‌(23 మ్యాచ్‌లు), ఒషోన్‌ థామస్‌ 11 నోబాల్స్‌(20 మ్యాచ్‌లు) ఉన్నారు. దీంతో అభిమానులు అర్ష్‌దీప్‌ను ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేశారు. 

చదవండి: స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసిన సుందర్‌..

మరిన్ని వార్తలు