EURO 2020: అభిమానానికి గుర్తుగా గిఫ్ట్‌; గుక్కపట్టి ఏడ్చేసిన అమ్మాయి

9 Jul, 2021 13:26 IST|Sakshi

లండన్‌: యూఈఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌ యూరోకప్‌ 2020లో ఇంగ్లండ్‌, డెన్మార్క్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ ఫుట్‌బాలర్‌ మాసన్‌ మౌంట్‌ మ్యాచ్‌ విజయంతో పాటు అభిమానుల మనుసులు గెలుచుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2-1 తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించి 55 ఏళ్ల తర్వాత మరో మెగాటోర్నీలో ఫైనల్‌కు అడుగుపెట్టింది.

ఈ చిరస్మరణీయ సన్నివేశాన్ని మైదానంలో ఉన్న అభిమానులు కూడా ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. వారి సంబరాలను మరింత రెట్టింపు చేయడానికి మౌంట్‌ తన జెర్సీని ఒక అమ్మాయికి కానుకగా ఇచ్చాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి తమకు మద్దతిచ్చిన ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తన జెర్సీని ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ అమ్మాయి ఏం అనుకుందో ఏమో తన తండ్రిని హద్దుకొని గట్టిగా ఏడ్చేసింది.

ఇదంతా చూసిన మిగతావాళ్లు.. '' మీ తండ్రీ కూతుళ్లు అదృష్టవంతులు.. ఇది సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన సమయం'' అంటూ కంగ్రాట్స్‌ చెప్పారు.  కాగా ఈ వీడియోనూ రెమ్‌ విలియ్స్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేయగా ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ దాదాపు 6.7 మిలియన్‌ వ్యూస్‌ రాగా.. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మెగాటోర్నీలో ఫైనల్‌ చేరిన ఇంగ్లండ్‌ జూలై 11న ఇటలీతో టైటిల్‌ పోరుకు తలపడనుంది. 

మరిన్ని వార్తలు