రెండు గేముల్లో ఓడిన హంపి

1 Sep, 2023 02:34 IST|Sakshi

కోల్‌కతాలో జరుగుతున్న టాటా స్టీల్‌ ఇండియా ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి రెండు గేముల్లో ఓడిపోయి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అర పాయింట్‌తో చివరిదైన పదో ర్యాంక్‌లో ఉంది. జు వెన్‌జున్‌ (చైనా)తో జరిగిన తొలి గేమ్‌ను 67 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... ఇరీనా క్రుష్‌ (అమెరికా)తో జరిగిన రెండో గేమ్‌లో 48 ఎత్తుల్లో... వంతిక (భారత్‌)తో జరిగిన మూడో గేమ్‌లో 24 ఎత్తుల్లో ఓటమి పాలైంది.

భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ఒక పాయింట్‌తో 8వ ర్యాంక్‌లో ఉంది. తొలి రౌండ్‌ లో దివ్య  (భారత్‌) చేతిలో 57 ఎత్తుల్లో ఓడిన హారిక... నినో బత్సియాష్విలి (జార్జియా)తో 26 ఎత్తుల్లో, సవితాశ్రీ (భారత్‌)తో 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో మూడు రౌండ్ల తర్వాత దివ్యæ, వంతిక 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు