WTC 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ దూరం.. టీమిండియాలోకి ఆంధ్ర ఆటగాడు

6 Apr, 2023 14:04 IST|Sakshi
శ్రేయస్‌ అయ్యర్‌(ఫైల్‌ ఫోటో)

టీమిండియా వెటరన్‌ ఆటగాడు, ఆంధ్రా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హనుమ విహారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ 2023-24 గాను ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాలో హనుమ విహారికి చోటు దక్కలేదు. దీంతో అతడు మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు కష్టమని అంతా భావించారు. కానీ విహారి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేసే ఇంకా దారులు మూసుకుపోలేదు.

ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు భారత జట్టులో హనుమ విహారికి చోటు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెన్ను గాయం కారణంగా దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో విహారి ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు యోచిస్తున్నట్లు సమాచారం. కాగా విహారీ దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో విహారి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతడికి మళ్లీ పిలుపునివ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా టీమిండియా తరుపున ఎన్నో విరోచిత ఇన్నింగ్స్‌లు ఈ ఆంధ్రా కెప్టెన్‌ ఆడాడు. లండన్‌ వంటి స్వింగ్‌ పిచ్‌లపై అద్భుతంగా ఆడే సత్తా హనుమ విహారికి ఉంది. 

                                                                               

ఇక ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు స్పందిస్తూ.. "శ్రేయస్‌ అయ్యర్‌ మా జట్టులో చాలా కీలమైన ఆటగాడు. అతడు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం మాకు పెద్ద ఎదురుదెబ్బ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు చాలా అనుభవజ్ఞుడైన ఆటగాడు. గతంలో ఆస్ట్రేలియా వంటి పిచ్‌లపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం కూడా అయ్యర్‌కు ఉంది. అతడి స్థానాన్ని మరో అనుభవజ్ఞుడైన ఆటగాడితో భర్తీ చేయాలని భావిస్తున్నాము.

మా సెలక్టర్లు హనుమ విహారి పేరును పరిశీలిస్తున్నారు. మే మొదటి వారంలో జరగనున్న సెలక్షన్‌ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటారని" పేర్కొన్నారు. కాగా విహారి చివరగా భారత్‌ తరపున గతేడాది ఇంగ్లండ్‌పై ఆడాడు. అప్పటి నుంచి అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.
చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు