ICC ODI Super League: చెలరేగిన తేజ నిడమనూరు.. అయినా వెస్టిండీస్‌ చేతిలో తప్పని ఓటమి!

1 Jun, 2022 12:38 IST|Sakshi
నెదర్లాండ్స్‌పై వెస్టిండీస్‌ ఘన విజయం(PC: Cricket Netherlands)

Netherlands Vs West Indies ODI Series: ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సిరీస్‌తో విండీస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథిగా ప్రయాణం ఆరంభించిన నికోలస్‌ పూరన్‌కు మధుర జ్ఞాపకంగా మిగిలింది.

కాగా మూడు వన్డేల సిరీస్‌ ఆడే నిమిత్తం వెస్టిండీస్‌ జట్టు తొలిసారిగా నెదర్లాండ్స్‌ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం వీఆర్‌ఏ క్రికెట్‌ స్టేడియం వేదికగా తొలి వన్డే జరిగింది. వరణుడి ఆటంకం కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఇందులో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు విక్రమ్‌జిత్‌ సింగ్‌(47 పరుగులు), మాక్స్‌ ఒడౌడ్‌(39 పరుగులు) శుభారంభం అందించారు. ఆ తర్వాత తక్కువ స్కోర్లకే బ్యాటర్లు పరిమితమైనప్పటికీ.. తేజా నిడమనేరు 58 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి నెదర్లాండ్స్‌ 240 పరుగులు చేసింది.

అయితే, ఇందుకు ధీటుగా బదులిచ్చిన వెస్టిండీస్‌ 43.1 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ షాయీ హోప్‌ 119 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. బ్రూక్స్‌ 60, బ్రాండన్‌ కింగ్‌ 58 పరుగులు సాధించారు. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. 11 బంతుల్లో కేవలం 7 పరుగులు చేశాడు. ఈ వరణుడి కారణంగా డీఎల్‌ఎస్‌ మెథడ్‌లో నిర్వహించిన మొదటి వన్డేలో విజయంతో విండీస్‌ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.

చదవండి: IPL 2022: పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌ చహల్‌, హసరంగ కూడా ఆ చెత్త జాబితాలో!

మరిన్ని వార్తలు