IND VS AUS 3rd ODI: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గోల్డన్‌ డకౌట్‌ అయిన సూర్యకుమార్‌.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

22 Mar, 2023 21:30 IST|Sakshi

టీమిండియా విధ్వంసకర ఆటగాడు, టీ20 స్టార్‌ ప్లేయర్‌ అయిన సూర్యకుమార్‌ యాదవ్‌కు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో స్కై.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డన్‌ డకౌటయ్యాడు (తొలి బంతికే ఔట్‌). దీంతో టీమిండియా అభిమానులు సోషల్‌మీడియా వేదికగా అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో స్టార్క్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీడబ్యూ అయిన సూర్యకుమార్‌.. ఆతర్వాత విశాఖలో జరిగిన రెండో వన్డేలోనూ స్టార్క్‌ బౌలింగ్‌లోనే తొలి బంతికే ఎల్బీడబ్యూ ఔట్‌ అయ్యాడు. తొలి రెండు వన్డేల్లో ఒకే బౌలర్‌ చేతిలో ఒకేలా ఔటైన సూర్యకుమార్‌.. చెన్నై వేదికగా ఇవాళ (మార్చి 22) జరుగుతున్న మూడో వన్డేలో ఆస్టన్‌ అగర్‌ బౌలింగ్‌లో తొలి బంతికే క్లీన్‌ బౌల్డై అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. సూర్యకుమార్‌ను తక్షణమే వన్డే జట్టు నుంచి తొలగించాలని ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. కొందరేమో ఇంత నిర్లక్ష్యంగా ఆడే వ్యక్తిని టీ20 జట్టు నుంచి కూడా తప్పించాలని కోరుతున్నారు. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. మహ్మద్‌ సిరాజ్‌ (7-1-37-2), అక్షర్‌ పటేల్‌ (8-0-57-2), హార్ధిక్‌ పాండ్యా (8-0-44-3), కుల్దీప్‌ యాదవ్‌ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 42 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

రోహిత్‌ శర్మ (30), శుభ్‌మన్‌ గిల్‌ (37), కేఎల్‌ రాహుల్‌ (32), అక్షర్‌ పటేల్‌ (2), విరాట్‌ కోహ్లి (54), సూర్యకుమార్‌ యాదవ్‌ (0) ఔట్‌ కాగా.. హార్ధిక్‌ (39), జడేజా (14) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ గెలవాలంటే 48 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.

మరిన్ని వార్తలు