India A vs New Zealand A, 1st unofficial ODI: న్యూజిలాండ్- ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో సంజూ శాంసన్ సేన పర్యాటక కివీస్పై గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల అనధికారిక వన్డే సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది.
చెన్నైలోని చెపాక్(చిదంబరం స్టేడియం) వేదికగా భారత్- ఏ జట్టు న్యూజిలాండ్తో తలపడింది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ సేన్ కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. శార్దూల్ 4, కుల్దీప్ సేన్ 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కుల్దీప్ యాదవ్కు ఒక వికెట్ దక్కింది.
స్వల్ప లక్ష్యం.. అలవోకగా..
భారత బౌలర్ల విజృంభణతో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే ఓపెనర్ పృథ్వీ షా(17 పరుగులు) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 41 పరుగులతో రాణించాడు. వన్డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి సైతం 31 పరుగులు చేశాడు.
ఇక కెప్టెన్ సంజూ శాంసన్ 29, రజత్ పాటిదార్ 45 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో 31.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 170 పరుగులు చేసిన.. భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్ను బాయ్కాట్ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది!