IND Vs NZ 2nd T20: టీమిండియాలో రెండు మార్పులు..? అర్షదీప్‌తో పాటు..!

29 Jan, 2023 15:01 IST|Sakshi

లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 29) జరుగనున్న రెండో టీ20 మ్యాచ్‌ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. తొలి టీ20లో పర్యాటక జట్టు చేతిలో ఎదురైన పరాభవం నేపథ్యంలో సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలవాలంటే టీమిండియా నేటి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుది జట్టులో పలు మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రాంచీ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని జట్టు ఓటమికి పరోక్ష కారణమైన అర్షదీప్‌పై వేటు దాదాపుగా ఖరారైంది. అతని స్థానంలో బీహార్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ అరంగేట్రం చేయడం లంఛనమేనని తెలుస్తోంది. ఇకపోతే, నేటి మ్యాచ్‌లో టీమిండియాలో మరో మార్పు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం.

రాహుల్‌ త్రిపాఠి స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను ఆడించాలన్నది కోచ్‌ ద్రవిడ్‌ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే జరిగితే గిల్‌తో పాటు ఎవరు ఓపెనింగ్‌ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారుతుంది. లెఫ్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇషాన్‌ కిషన్‌.. లేకుంటే పృథ్వీ షా గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తారు.

ఈ రెండు మార్పులు మినహా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టే యధాతథంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. బెంచ్‌పై ఆప్షన్స్‌ లేకపోవడం, అలాగే తొలి మ్యాచ్‌లో అందరూ తమతమ పాత్రలకు కొద్దో గొప్పో న్యాయం చేయడంతో తుది జట్టులో ఇంతకుమించి మార్పులకు ఆస్కారం ఉండకపోవచ్చు.

రెండో టీ20కి భారత తుది జట్టు (అంచనా)..
శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ మావీ, కుల్దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ముకేశ్‌ కుమార్‌


 

>
మరిన్ని వార్తలు