India Open 2023: శ్రీకాంత్‌కు మళ్లీ నిరాశ 

19 Jan, 2023 12:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లోనే ని్రష్కమించాడు. ప్రపంచ నంబర్‌వన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 14–21, 19–21తో ఓడిపోయాడు. అక్సెల్‌సన్‌ చేతిలో శ్రీకాంత్‌కిది పదో పరాజయం కావడం గమనార్హం.

2017లో డెన్మార్క్‌ ఓపెన్‌లో చివరిసారి అక్సెల్‌సన్‌ను ఓడించిన శ్రీకాంత్‌ ఆ తర్వాత ఈ డెన్మార్క్‌ ప్లేయర్‌ చేతిలో వరుసగా ఏడోసారి ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మాళవిక (భారత్‌) 17–21, 12–21తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో... ఆకర్షి 15–21, 12– 21తో బీవెన్‌ జాంగ్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అశ్విని –శిఖా (భారత్‌) 8–21, 11–21తో పియర్లీ తాన్‌–థినా (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. 

మరిన్ని వార్తలు