సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్‌..లీగ్‌ నుంచి స్టార్‌ ఆటగాడు ఔట్‌

31 Mar, 2021 18:15 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊహించని గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్ లీగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఊహించని ఈ పరిణామంతో జట్టు యాజమాన్యంతో సహా సన్‌రైజర్స్‌ అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కరోనా నేపథ్యంలో బయో బబుల్‌లో ఉండటం కష్టంగా భావించిన మిచెల్ మార్ష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి తెలియజేశాడని సమాచారం. ప్రస్తుత ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం.. మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్‌లో ఉండాల్సి ఉంది. దీన్ని కష్టంగా భావించిన ఆయన లీగ్ నుంచి తప్పుకున్నాడు. మార్ష్‌.. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే గాయం కారణంగా లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2020 వేలంలో సన్‌రైజర్స్‌ అతన్ని కనీస ధర రూ.2 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది.

కాగా, మిచెల్ మార్ష్ స్థానంలో ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ జేసన్ రాయ్‌ని తీసుకునేందుకు సన్‌రైజర్స్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాయ్‌ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో వేళంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇదిలా ఉండగా కెప్టెన్‌ వార్నర్‌ త్వరలో జట్టుతో కలువనుండగా, స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ రాకపై ఇంకా స్పష్టత లేదు. ఏప్రిల్‌ 11న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోలకతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి.
చదవండి: పుజారా ఆన్‌ ఫైర్‌.. సిక్సర్లు బాదుతున్న నయా వాల్‌

మరిన్ని వార్తలు