IPL 2024-Siraj Broken Heart Post: హృదయం ముక్కలైంది.. సిరాజ్‌ పోస్ట్‌ వైరల్‌! అతడికి ఏకంగా రూ. 11 కోట్లు!

21 Dec, 2023 17:11 IST|Sakshi

టీమిండియా స్టార్‌ బౌలర్‌, ఆర్సీబీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన సోషల్‌ మీడియా పోస్ట్‌తో నెట్టింట వైరల్‌ అవుతున్నాడు. ఇన్‌స్టా స్టోరీలో ముక్కలైన హృదయాన్ని తలపించే ఎమోజీలతో హాట్‌టాపిక్‌గా మారాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌ నర్మగర్భ పోస్ట్‌పై టీమిండియా, ఆర్సీబీ ఫ్యాన్స్‌ తమకు తోచిన విధంగా కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా హైదరాబాదీ స్టార్‌ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో భాగమైన అతడికి.. వన్డే సిరీస్‌ సందర్భంగా మేనేజ్‌మెంట్‌ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో.. డిసెంబరు 26న మొదలుకానున్న టెస్టు సిరీస్‌తో సిరాజ్‌ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. 

ఈ నేపథ్యంలో రెడ్‌ హార్ట్‌బ్రేక్‌ ఎమోజీలను సిరాజ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేయడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో.. ‘‘ఐపీఎల్‌-2024 వేలంలో ఆర్సీబీ అనుసరించిన వ్యూహాలు.. బౌలర్లను కొనుగోలు చేసిన విధానం సిరాజ్‌కు నచ్చలేదేమో’’ అని కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

మరికొందరేమో.. ‘‘కొంపదీసి సిరాజ్‌ గాయపడ్డాడా ఏంటి? ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై ఇండియా టెస్టు సిరీస్‌ గెలిచిందే లేదు. ఇప్పటికే మహ్మద్‌ షమీ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు సిరాజ్‌ ఈ బ్రేకింగ్‌ హార్ట్‌ ఎమోజీలతో ఏం సందేశం ఇస్తున్నట్లు?’’ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంకొందరేమో.. ‘‘సూర్యకుమార్‌ యాదవ్‌ మాదిరిగానే సిరాజ్‌ ఆర్సీబీ కెప్టెన్‌ కావాలని భావించాడేమో! పాపం.. ఇంతకీ ఆర్సీబీ క్యాంప్‌లో ఏం జరుగుతోందో మీకేమైనా తెలుసా?’’ అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2024 వేలానికి ముందు హార్దిక్‌ పాండ్యాను ట్రేడ్‌ చేసుకున్న ముంబై ఇండియన్స్‌ అతడిని కెప్టెన్‌గా నియమించింది.

టీమిండియా సారథి రోహిత్‌ శర్మను కాదని పాండ్యాకు పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో తన హృదయం ముక్కలైందంటూ.. రోహిత్‌ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్‌ను ముందుకు నడిపించిన సూర్యకుమార్‌ పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్‌ క్రిప్టిక్‌ పోస్ట్‌ నేపథ్యంలో సూర్య పోస్ట్‌ను తెరమీదకు తెచ్చి నెటిజన్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు. తాను ఆ ఎమోజీలు పోస్ట్‌ చేయడానికి గల కారణం ఏమిటో మహ్మద్‌ సిరాజ్‌ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. 

ఐపీఎల్‌ వేలం-2024లో ఆర్సీబీ కొన్న ప్లేయర్లు వీరే:
వెస్టిండీస్‌ స్పీడ్‌స్టర్‌ అల్జారీ జోసెఫ్‌ను అత్యధికంగా రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. అతడితో పాటు యశ్ దయాళ్ (రూ.5 కోట్లు), టామ్ కరన్ (రూ.1.50 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2 కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ.20 లక్షలు), సౌరవ్ చౌహాన్ (రూ.20 లక్షలు)లను సొంతం చేసుకుంది. ఇక సిరాజ్‌ను ఆర్సీబీ రూ. ఏడు కోట్లకు రిటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు