IPL 2024: సొంత గూటికి గౌతమ్‌ గంభీర్‌

22 Nov, 2023 13:45 IST|Sakshi

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో తన సొంతగూటికి చేరుకుంటున్నట్లు ప్రకటించాడు. 2023 సీజన్‌ వరకు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా పని చేసిన గంభీర్.. వచ్చే సీజన్‌ నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సేవలు అందించనున్నట్లు వెల్లడించాడు. 2012, 2014 ఎడిషన్లలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన గంభీర్‌ తిరిగి తన సొంతగూటికి చేరడంపై హర్షం వ్యక్తం చేశాడు.

కేకేఆర్‌ యాజమాన్యం గంభీర్‌కు ఆత్మీయ స్వాగతం పలికింది. గంభీర్‌ వచ్చే సీజన్‌ నుంచి హెడ్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌తో పాటు కేకేఆర్‌ బృందంలో భాగమవుతాడు. గంభీర్‌ మెంటార్‌గా కేకేఆర్‌కు సేవలిందిస్తాడు. గంభీర్‌ చేరికను కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ నిర్ధారించారు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభానికి చాలా సమయం ఉండగానే అన్ని ఫ్రాంఛైజీల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో హెడ్ కోచ్‌కు స్థానచలనం కలిగింది. సంజయ్‌ బాంగర్‌ స్థానంలో ఆండీ ఫ్లవర్‌ హెడ్ కోచ్‌గా నియమించబడ్డాడు. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు బౌలింగ్‌ కోచ్‌లను మార్చాయి. ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న షేన్‌ బాండ్‌ రాజస్థాన్ రాయల్స్‌కు.. బాండ్ స్థానంలో లసిత్ మలింగ ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ కోచ్‌గా అపాయింట్ అయ్యారు.

మరిన్ని వార్తలు