మోదీ.. పాక్ ప్రధానికి చేసిన ట్వీ‌ట్‌ సంతోషానిచ్చింది

25 Mar, 2021 17:41 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇటీవల కోవిడ్‌ బారిన పడ్డ పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షేమం కోరుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. భారత్- పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగపడితే తన కల నేరవేరినట్టేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రజలందరూ ఒకరికొకరు అండగా ఉండటం చాలా ముఖ్యమని, అది ఈ ఏడాది ప్రతి ఒక్కరికి తెలుసొచ్చిందని ఆయన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, పాక్‌ ప్రధాని కోవిడ్‌ వ్యాక్సిన్‌(చైనా వ్యాక్సిన్‌) వేయించుకున్న తరువాత వైరస్‌బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. 

భారత్‌, పాక్‌ల మధ్య ఈ ఏడాది ఆఖర్లో ద్వైపాక్షిక సిరీస్‌ జరుగుతుందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా పీటర్సన్‌ చేసిన ట్వీట్‌ ప్రాధాన్యత సంతరించుకంది. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరిగి ఎనిమిదేళ్లవుతుంది. చివ‌రిసారి ఈ రెండు జట్లు 2012-13లో భారత్‌ వేదికగా తలపడ్డాయి. ఈ సిరీస్‌లో 2 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. పాక్‌ వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్లు చెరో టీ20 గెలవడంతో టీ20 సిరీస్‌ డ్రాగా ముగిసింది. భారత జట్టు చివరిసారిగా 2008లో పాక్‌లో పర్యటించింది. ఇవి మినహా ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడ్డాయి. భారత్‌, పాక్‌లు చివరిసారిగా 2019లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 89 పరుగల తేడాతో(డక్‌వర్త్‌) పాక్‌పై ఘనవిజయం సాధించింది.  
చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత దాయాదుల క్రికెట్‌ పోరు..?
చదవండి: ప్రసిద్ద్‌ కృష్ణ.. మేడిన్‌ ఆస్ట్రేలియా
 

మరిన్ని వార్తలు