హార్దిక్‌ కాదు! ధోని మాదిరి ప్రభావం చూపగల బ్యాటర్‌ అతడే: సురేశ్‌ రైనా

8 Oct, 2023 17:18 IST|Sakshi

Suresh Raina Intresting Comments: టీమిండియా మాజీ బ్యాటర్‌ సురేశ్‌ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్‌ ధోని మాదిరి డెత్‌ ఓవర్లలో ప్రభావం చూపగల బ్యాటర్‌ ఇతడేనంటూ టీమిండియా టీ20 స్టార్‌ పేరును ఎంచుకున్నాడు. కాగా టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ ధోని బెస్ట్‌ ఫినిషర్‌గా పేరొందిన విషయం తెలిసిందే.

తన అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌-2011లో సిక్స్‌తో టీమిండియాను జగజ్జేతగా నిలిపిన క్షణాలను అభిమానులు మర్చిపోలేరు. ఆరంభంలో వికెట్లు పడ్డా.. ధోని కాసేపు నిలబడితే చాలు మ్యాచ్‌ గెలుస్తామనే ధీమా!

హార్దిక్‌ పాండ్యా సైతం
ఇక గత కొన్నేళ్లుగా డెత్‌ ఓవర్లలో మెరుగ్గా ఆడుతున్న మరో టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన పాండ్యా భావి కెప్టెన్‌గానూ నీరాజనాలు అందుకుంటున్నాడు.

ధోని తర్వాత సూర్యకుమార్‌ మాత్రమే
ఈ నేపథ్యంలో సురేశ్‌ రైనా మాత్రం.. డెత్‌ ఓవర్లలో హార్దిక్‌ పాండ్యాను కాదని.. వరల్డ్‌ నంబర్‌ 1 టీ20 బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ధోని వారసుడిగా ఎంచుకోవడం విశేషం. స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడిన ఈ మాజీ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. ‘‘ధోని కాకుండా డెత్‌ ఓవర్లలో అంతటి ప్రభావం చూపగల బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రమే’’ అని పేర్కొన్నాడు.

గొప్ప రికార్డేమీ లేదు
కాగా వన్డేల్లో సూర్యకు అంతగొప్ప రికార్డేమీ లేదు. అయినప్పటికీ వన్డే వరల్డ్‌కప్‌-2023 జట్టులో అతడికి స్థానం దక్కింది. ఈ క్రమంలో విమర్శలు వెల్లువెత్తుగా.. మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు బాది ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో సురేశ్‌ రైనా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాగా ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో రైనా సభ్యుడన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అక్టోబరు 8న చెన్నై వేదికగా టీమిండియా.. ఆసీస్‌తో మ్యాచ్‌తో ప్రపంచకప్‌-2023 జర్నీ ఆరంభించింది.

చదవండి: వీడెవడండీ బాబూ.. జార్వో మామ మళ్లీ వచ్చేశాడు! కోహ్లి నచ్చచెప్పడంతో

మరిన్ని వార్తలు