ODI World CUP 2023: టీమిండియాకు బ్యాడ్‌ న్యూస్‌.. వన్డే వరల్డ్‌కప్‌కు పంత్‌ దూరం!

6 Jan, 2023 16:39 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ కోలుకుంటున్నాడు. అతడు ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. తొలుత డెహ్రడూన్‌లోని మ్యాక్స్‌ అసుపత్రిలో చికిత్స పొం‍దిన పంత్‌ను మెరుగైన వైద్యం కోసం కోకిలాబెన్ ఆసుపత్రికి తాజాగా తరలించారు.

అయితే పంత్‌ పూర్తిగా కోలుకోవడానికి  కనీసం 8 నుంచి 9 నెలల సమయం పడుతుందని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో పంత్‌ ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్‌ ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత్‌ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.

"పంత్‌ మోకాలి గాయం ఏ స్థాయిలో ఉందో ఇంకా సృష్టంగా తెలియదు. రాబోయో మూడు నాలుగు రోజుల్లో మొత్తం స్కాన్‌ రిపోర్టులు వస్తాయి. అయితే రిషభ్‌ లిగమెంట్‌ టియర్‌కు సర్జరీ జరగనుంది. అతడు మళ్లీ దాదాపు 8 నుంచి 9 నెలల తర్వాతే తిరిగి మైదానంలో అడుగుపెట్టగలడని మేము భావిస్తున్నాము" అని కోకిలాబెన్ ఆసుపత్రి సీనియర్‌ డాక్టర్‌ ఒకరు బీసీసీఐ మెడికల్‌ టీంతో పేర్కొన్నారు.

ఇక ఇదే విషయంపై బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. "రిషబ్‌ ట్రావెల్‌ చేయాడానికి సిద్దంగా ఉన్నాడని వైద్యులు బావిస్తే,  వెంటనే అతడిని శస్త్రచికిత్స కోసం లండన్‌కు పంపుతారు. అయితే అతడు ప్రాధమికంగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా తెలియదు.

పంత్‌ ప్రస్తుతం కోకిలాబెన్ ఆసుపత్రిలో డాక్టర్ పార్దివాలా బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రస్తుత రిపోర్ట్స్‌ ప్రకారం రిషబ్‌ మోకాలికి, చీలమండ రెండింటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి కచ్చితంగా తొమ్మిది నెలల సమయం పడుతుంది" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: AP Vs HYD: రికీ, కరణ్‌ సెంచరీలు! చెలరేగిన శశికాంత్‌.. హైదరాబాద్‌పై ఆంధ్ర భారీ విజయం

మరిన్ని వార్తలు