Rahul Dravid: టీమిండియా హెడ్‌కోచ్‌ అయితేనేం.. కుమారుల కోసం అలా సింపుల్‌గా..

2 Dec, 2023 10:07 IST|Sakshi
అదరగొట్టిన అన్వయ్‌- భార్యతో రాహుల్‌ ద్రవిడ్‌ (PC: X)

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తన భార్య విజితతో కలిసి ఉన్న ఈ చిత్రం మైసూర్‌లోనిది. ద్రవిడ్‌ పెద్ద కుమారుడు సమిత్‌ ఇక్కడ జరుగుతున్న బీసీసీఐ దేశవాళీ టోర్నీ (అండర్‌–19) కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో కర్నాటక తరఫున ఆడుతున్నాడు.

ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ద్రవిడ్‌ వచ్చాడు. మరో వైపు విజయవాడలో జరుగుతున్న అండర్‌–16 విజయ్‌మర్చంట్‌ ట్రోఫీలో ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ బరిలో ఉన్నాడు. ఉత్తరాఖండ్‌తోనే జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు.. కెప్టెన్‌, వికెట్‌కీపర్‌ అయిన అన్వయ్‌ 59 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.   

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే, అతడి కాంట్రాక్ట్‌ను పొడగిస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. తదుపరి టీ20 ప్రపంచకప్‌-2024 వరకు ద్రవిడ్‌నే హెడ్‌కోచ్‌గా కొనసాగించే అవకాశం ఉంది.

ఇక ప్రస్తుతం సెలవులో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ తన కుటుంబానికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో కుమారుడు సమిత్‌ మ్యాచ్‌ చూసేందుకు భార్యతో కలిసి మైదానానికి వెళ్లాడు. 

ఇక ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో ఆల్‌రౌండర్‌ సమిత్‌ తన ఐదు ఓవర్ల బౌలింగ్‌లో రెండు మెయిడెన్స్‌ వేసి 11 పరుగులు ఇచ్చాడు. మొదటిరోజు ఆట ముగిసే సరికి ఉత్తరాఖండ్‌ 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.

ఇదిలా ఉంటే.. రాహుల్‌ ద్రవిడ్‌ గైర్హాజరీ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ద్రవిడ్‌ తిరిగి తన బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా భార్యతో కలిసి ద్రవిడ్‌ మైసూర్‌లో మ్యాచ్‌ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ద్రవిడ్‌ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

మరిన్ని వార్తలు