ఆసీస్‌తో నాలుగో టీ20.. తిలక్‌, ప్రసిద్ద్‌ ఔట్‌.. వారి స్థానాల్లో..?

1 Dec, 2023 13:42 IST|Sakshi

రాయ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (డిసెంబర్‌ 1) జరిగే నాలుగో టీ20లో టీమిండియా రెండు మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. వరల్డ్‌కప్‌ అనంతరం విరామం తీసుకున్న శ్రేయస్‌, ఇటీవలే పెళ్లిపీటలెక్కిన ముకేశ్‌ కుమార్‌ తిరిగి జట్టులో చేరనున్నారని సమాచారం​.  

ఈ సిరీస్‌ మొత్తంలో ఆశించిన మేర రాణించలేకపోయిన తిలక్‌ వర్మ, మూడో టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ద్‌ కృష్ణ స్థానాల్లో శ్రేయస్‌, ముకేశ్‌ జట్టులో చేరతారని ప్రచారం జరుగుతుంది. శ్రేయస్‌ జట్టులోకి వస్తే సూర్యకుమార్‌ ఓ మెట్టు దిగి ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాల్సి వస్తుంది.

ఓపెనర్లుగా యశస్వి, రుతురాజ్‌.. వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌, నాలుగో స్థానంలో శ్రేయస్‌, ఆతర్వాత సూర్యకుమార్‌, రింకూ సింగ్‌ బ్యాటింగ్‌కు దిగే అవకాశం​ ఉంది. బౌలర్లుగా అక్షర్‌, రవి భిష్ణోయ్‌, అర్షదీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌ కొనసాగవచ్చు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్లంతా స్వదేశానికి పయనమయ్యారు. కొత్త ముఖాలతో ఆసీస్‌ బరిలోకి దిగనుంది. హెడ్‌, వేడ్‌ మినహా అన్ని పెద్ద పరిచయం లేని ముఖాలే. 

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా.. మూడో టీ20లో పరాజయంపాలైంది. సూర్య నాయకత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. 

తుది జట్లు (అంచనా)
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), యశస్వి, రుతురాజ్, ఇషాన్‌ కిషన్, అయ్యర్, రింకూ సింగ్, అక్షర్, బిష్ణోయ్, అర్షదీప్‌, అవేశ్, ముకేశ్‌.  
ఆస్ట్రేలియా: వేడ్‌ (కెప్టెన్ ), హార్డీ, హెడ్, షార్ట్, మెక్‌డెర్మాట్, డేవిడ్, క్రిస్‌ గ్రీన్, డ్వార్‌షుయిస్, ఎలిస్,  బెహ్రన్‌డార్ఫ్, సంఘా. 

మరిన్ని వార్తలు