-

మహిళా కానిస్టేబుల్‌తో రవీంద్ర జడేజా వాగ్వాదం

11 Aug, 2020 17:13 IST|Sakshi

గాంధీనగర్‌ : భారత క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రాజ్‌కోట్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగినట్లు మంగళవారం గుజరాత్‌ పోలీసులు తెలిపారు. వివరాలు.. జడేజా తన భార్య రివిబాతో కలిసి  సోమవారం రాత్రి  9. గంటల సమయంలో కారులో వెళ్తుండగా వీరి వాహనాన్ని తనిఖీ చేసేందుకు మహిళా కానిస్టేబుల్‌ సోనాల్‌ గోసాయ్‌ అడ్డగించారు. కారు డ్రైవింగ్‌ సీట్‌లో జడేజా మాస్క్‌ ధరించి ఉన్నప్పటికీ అతని భార్య మాస్క్‌ ధరించలేదు. దీంతో ఎందుకు మాస్క్‌ ధరించలేదని ప్రశ్నించడంతోపాటు జరిమానా చెల్లించాలని మహిళా పోలీస్‌ ఆదేశించింది. దీంతో రవీంద్ర జడేజాకు కానిస్టేబుల్‌కు మధ్య వాదన పెరిగి వాగ్వాదానికి దిగినట్లు, మరోవైపు రివిబా కూడా ఆమెతో దురుసుగా ప్రవర్తించినట్లు డీసీపీ మనోహర్‌ సింగ్‌ తెలిపారు. (నెలలో 16.2 లక్షల సార్లు)

అయితే తమ ప్రాథమిక దర్యాప్తులో జడేజా భార్య రవిబా మాస్క్‌ ధరించలేదని వెల్లడైందని పోలీసులు తెలిపారు. అసలు వీరి మధ్య గొడవ ఎందుకు పెద్దదయ్యిందనే విషయంపై దర్యాప్తు జరుగుతుందని వివరించారు. కాగా ఇద్దరి మధ్య ఘర్షణ అనంతరం మహిళా కానిస్టేబుల్‌ స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కుదుట పడిందని ఇప్పుడు డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. అంతేగాక ఇటు జడేజా నుంచి అటు కానిస్టేబుల్‌ నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. ('ఆరోజు సచిన్‌ నక్కతోకను తొక్కాడు')

మరిన్ని వార్తలు