రెండో గేమ్‌లో కార్ల్‌సన్‌తో గట్టి పోరాటమే చేయాలి: ప్రజ్ఞానంద

23 Aug, 2023 02:51 IST|Sakshi

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగం టైటిల్‌ కోసం భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద, వరల్డ్‌ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) మధ్య జరిగిన తొలి గేమ్‌ ‘డ్రా’గా ముగిసింది. తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడాడు. 35 ఎత్తుల తర్వాత ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు సమ్మతించారు.

‘తొలి గేమ్‌లో నేను ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. రెండో గేమ్‌లో కార్ల్‌సన్‌తో గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుంది. అతడిని నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. వీరిద్దరి మధ్య నేడు రెండో గేమ్‌ జరుగుతుంది. ఈ గేమ్‌లో కార్ల్‌సన్‌ తెల్ల పావులతో ఆడతాడు. ఈ గేమ్‌లో గెలిచిన ప్లేయర్‌కు ప్రపంచకప్‌ టైటిల్‌ లభిస్తుంది. ఒకవేళ రెండో గేమ్‌ కూడా ‘డ్రా’ అయితే గురువారం టైబ్రేక్‌ గేమ్‌ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. 

మరిన్ని వార్తలు