ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌.. దుమ్మురేపిన పంత్‌

11 Mar, 2021 11:56 IST|Sakshi

ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌–10లోకి

భారత వికెట్‌ కీపర్‌

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించిన వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. తాజాగా ప్రకటించిన బ్యాట్స్‌మన్‌ ర్యాంకుల్లో పంత్‌ 7వ స్థానానికి చేరుకున్నాడు. తన మెరుపు శతకంతో పంత్‌ ఏడు స్ధానాలు మెరుగుపర్చుకోవడం విశేషం. 747 రేటింగ్‌ పాయింట్లతో ఇదే స్థానంలో ఉన్న రోహిత్‌ శర్మ, హెన్రీ నికోల్స్‌లతో పంత్‌ సమంగా నిలిచాడు. ఐసీసీ బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో ఒక భారత వికెట్‌ కీపర్‌ టాప్‌–10లో నిలవడం ఇదే మొదటిసారి కాగా... అత్యుత్తమ రేటింగ్‌ (747) కూడా ఇదే కావడం మరో విశేషం.

ఈ జాబితాలో విలియమ్సన్‌ (919) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా...విరాట్‌ కోహ్లి (5వ) తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో పోరులో మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచిన అతను 850 రేటింగ్‌ పాయింట్లతో 2017 ఆగస్టు తర్వాత మొదటిసారి రెండో ర్యాంక్‌ను అందుకోగలిగాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి బుమ్రా 10వ స్థానంలో నిలవగా, ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్‌ (353 పాయింట్లు) నాలుగో స్థానాన్ని అందుకోవడం విశేషం.  

టి20ల్లో రెండో ర్యాంక్‌కు...  
ఐసీసీ టి20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు (268 రేటింగ్‌) రెండో స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో అప్పటి వరకు రెండో స్ధానంలో ఉన్న ఆస్ట్రేలియా (267)...మూడుకు పడిపోగా భారత్‌ ముందంజ వేసింది. ఇంగ్లండ్‌ (275)  నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతోంది. టి20 బ్యాట్స్‌మన్‌ టాప్‌–10 ర్యాంకుల్లో భారత్‌ నుంచి రాహుల్‌ (2), కోహ్లి (6) ఉండగా...బౌలర్, ఆల్‌రౌండర్‌ జాబితాలో ఎవరికీ చోటు దక్కలేదు.

మరిన్ని వార్తలు