టాప్‌ 2కు దూసుకొచ్చిన రోహిత్‌.. మొదటి స్థానంలో కోహ్లి

21 Mar, 2021 09:13 IST|Sakshi

అహ్మదాబాద్‌: అంతర్జాతీయ టీ20ల్లో డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ టాప్-2లోకి దూసుకొచ్చాడు. అయితే ఇక్కడ చెప్పుకునేది ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ మాత్రం కాదు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్‌ శర్మ 2వ స్థానానికి దూసుకురాగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇంగ్లండ్‌తో శనివారం రాత్రి జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో 34 బంతులాడిన రోహిత్ శర్మ 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

కాగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 3,103 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,839 పరుగులతో ఉన్నాడు. అయితే తాజాగా రోహిత్‌ హాఫ్‌ సెంచరీతో రాణించి 2,864 పరుగులతో మార్టిన్‌ను మూడో స్థానానికి నెట్టేశాడు. కాగా రోహిత్‌ శర్మ ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లాడి 2,864 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–2తో గెలుచుకుంది.

శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఓపెనర్‌గా దిగిన కోహ్లి ముగ్గురు సహచరులతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. 
చదవండి:
మ్యాచ్‌కే హైలెట్‌గా సూర్యకుమార్‌ అవుటైన తీరు..
ఆఖరి పోరులో అదరగొట్టారు

మరిన్ని వార్తలు