ఏకంగా 56 స్థానాలు మెరుగుపర్చుకున్న రుతురాజ్‌.. టాప్‌-5లోకి భిష్ణోయ్‌

6 Dec, 2023 13:58 IST|Sakshi

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ఆసీస్‌తో ఇటీవల ముగిసిన సిరీస్‌లో మూకుమ్మడిగా రాణించిన భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌ను భారీగా  మెరుగుపర్చుకున్నారు.

ఆసీస్‌తో సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 55.75 సగటున 223 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్‌.. ఏకంగా 56 స్థానాలు మెరుగపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకగా.. అదే సిరీస్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన రవి భిష్ణోయ్‌  (5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు.

ఇదే సిరీస్‌లో రెండో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ (5 మ్యాచ్‌ల్లో 144 పరుగులు) తన టాప్‌ ర్యాంక్‌ను (881 పాయింట్లు) మరింత పదిలం చేసుకున్నాడు. ఈ మార్పులు మినహాయించి తాజా టీ20 ర్యాంకింగ్స్‌ పెద్దగా మార్పులు జరగలేదు.

బ్యాటింగ్‌లో స్కై తర్వాత మహ్మద్‌ రిజ్వాన్‌, మార్క్రమ్‌, బాబార్‌ ఆజమ్‌, రిలీ రొస్సో, డేవిడ్‌ మలాన్‌, రుతురాజ్‌, జోస్‌ బట్లర్‌, రీజా హెండ్రిక్స్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ వరుసగా టాప్‌-10లో ఉన్నారు. బౌలింగ్‌ విషయానికొస్తే.. రషీద్‌ ఖాన్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హసరంగ, ఆదిల్‌ రషీద్‌, తీక్షణ, భిష్ణోయ్‌, సామ్‌ కర్రన్‌, ఫజల్‌ హక్‌ ఫారూకీ, ముజీబ్‌, అకీల్‌ హొసేన్‌, హాజిల్‌వుడ్‌ టాప్‌-10 జాబితాలో నిలిచారు. కాగా, ఆసీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు