Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌ మాజీ కోచ్‌ ఘాటు వ్యాఖ్యలు.. పొట్టలు వేలాడేసుకుని, ఒళ్లు సహకరించక

19 Oct, 2022 13:57 IST|Sakshi
మిస్బా ఉల్‌ హక్‌(ఫైల్‌ ఫొటో- PC: PCB)

T20 World Cup 2022- India Vs Pakistan: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ మిస్బా ఉ​ల్‌ హక్‌ తమ జట్టును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశాడు. పాక్‌ ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌పై పట్టింపు లేదని.. పొట్టలు వేలాడటం అందరికీ కనిపిస్తోందంటూ దారుణంగా విమర్శించాడు. శరీర కింది భాగంలో అధిక బరువు కారణంగా పరుగులు తీసేందుకు వారికి ఒళ్లు సహకరించడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచకప్‌-2022 నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న పాకిస్తాన్‌ తొలుత ఇంగ్లండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. ఇందులో పాక్‌ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో టీవీ షోలో మాట్లాడిన మిస్బా ఉల్‌ హక్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దేశవాళీ క్రికెట్‌లో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు ఫిట్‌నెస్‌ టెస్టు అనేది పెద్ద జోక్‌లా తయారైందన్నాడు. అంతర్జాతీయ స్థాయి మాదిరిగానే ప్రమాణాలు నెలకొల్పాలని తాము ఎంతగా చెప్పినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. 

ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌, వార్మప్‌ మ్యాచ్‌లో పరాజయం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘పాక్‌ ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వకార్‌ నాలుగుసార్లు, నేను ఒకసారి కోచ్‌ పదవులను వదిలేసిన సంగతి తెలిసిందే. 

నాతో సహా షోయబ్‌ మాలిక్‌, యూనిస్‌ ఖాన్‌ వంటి ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌పై దృష్టి ఉండేది. ఎవరో మమ్మల్ని ముందుకు తోస్తేనే ఆ విషయం గురించి ఆలోచించకుండా స్వయంగా మాకు మేముగా ఫిట్‌గా ఉండాలని శ్రమించేవాళ్లం.

కానీ ఇప్పుడు.. ఆటగాళ్ల పొట్టలు బయటికి కనబడుతున్నాయి. ... అధిక బరువు కారణంగా వాళ్లు ఫీల్డ్‌లో పాదరసంలా కదలలేకపోతున్నారు. ఫిట్‌నెస్‌ ప్రమాణాలు తగిన స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణం’’ అని మిస్బా ఉల్‌ హక్‌ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 23న టీమిండియాతో పాక్‌ ప్రపంచకప్‌-2022 టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: SCO Vs IRE: స్కాట్లాండ్‌పై ఐర్లాండ్‌ ఘన విజయం.. సూపర్‌ 12 ఆశలు సజీవం
T20 WC- Semi Finalists: ప్రపంచకప్‌.. సెమీస్‌ చేరేది ఆ నాలుగు జట్లే! ఇక విజేతగా..: సచిన్‌ టెండుల్కర్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు