Virender Sehwag: నమీబియాకు, టీమిండియాకు తేడా తెలియలేదు

1 Nov, 2021 19:24 IST|Sakshi

Virender Sehwag Says No Chance For Team India Enter Semifinals T20 WC.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియ దారుణ ప్రదర్శనపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో చురకలు అంటించాడు. ఏం చేసినా టీమిండియా సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టదని తెలిపాడు. తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసిన వీడియోలో సెహ్వాగ్‌ మాట్లాడాడు. 

చదవండి: క్యాచ్‌ పట్టేస్తారని మధ్యలో దూరింది; ఔట్‌ కాదా.. ఇదెక్కడి రూల్‌

''ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడంలో టీమిండియా మరోసారి విఫలమైంది. వరుసగా నాలుగోసారి ఓటమినే మూటగట్టుకుంది. ఒకవేళ టీమిండియా మిగిలిన మ్యాచ్‌లను పెద్ద తేడాతో గెలిచినప్పటికి సెమీస్‌ అవకాశాలు ఎంత మాత్రం లేవు.. ఆ ఆలోచన చేయడం కూడా వ్యర్థమే. అసలు ఇది టీమిండియాకు లభించాల్సిన టి20 ప్రపంచకప్‌ మాత్రం కాదు. ఎందుకంటే అఫ్గన్‌తో మ్యాచ్‌లో నమీబియా ఎలా ఆడిందో.. అచ్చం అదే రీతిలో టీమిండియా కివీస్‌తో మ్యాచ్‌లో ఆడింది. ఐపీఎల్‌ టీమిండియా ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసింది. అది జరగకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా సెమీస్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ దెబ్బతో టీమిండియా టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచినప్పటికి మిగతా జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను బుధవారం(నవంబర్‌ 3) అఫ్గనిస్తాన్‌తో ఆడనుంది.

చదవండి: T20 World Cup 2021 IND Vs NZ: మరోసారి దగ్గరుండి టీమిండియా పుట్టి ముంచిన కెటిల్‌బరో..!

మరిన్ని వార్తలు