IND Vs ZIM: జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌కు టీమిండియా

6 Nov, 2022 17:06 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. జింబాబ్వేతో జరిగిన సూపర్‌-12 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టీమిండియా బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాడలేకపోయింది.

భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో జింబాబ్వే ఒత్తిడిలో పడిపోయింది. రియాన్‌ బర్ల్‌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. సికందర్‌ రజా 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ 3, మహ్మద్‌ షమీ, హార్దిక్‌ పాండ్యాలు రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌, అక్షర్‌ పటేల్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

ఈ విజయంతో టీమిండియా గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక సెమీఫైనల్లో గ్రూప్‌-1లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాయి. ఇక మరొక సెమీస్‌లో టోర్నీ ఫేవరెట్‌ న్యూజిలాండ్‌తో పాకిస్తాన్‌ ఆడనుంది. అన్ని కుదిరితే టీమిండియా, పాకిస్తాన్‌ ఫైనల్లో తలపడే అవకాశాలున్నాయి. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్‌ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్‌ యాదవ్‌ 61 నాటౌట్‌, కేఎల్‌ రాహుల్‌ 51 రాణించారు. 

మరిన్ని వార్తలు