ఆసియా కప్-2023లో భాగంగా పాక్‌లో పర్యటించనున్న టీమిండియా..!

16 Oct, 2021 21:26 IST|Sakshi

Team India Likely To Tour Pakistan After 17 Years For Asia Cup 2023: 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులను దాయాది దేశ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) దక్కించుకోవడంతో టీమిండియా పాక్ పర్యటన అంశం తెరపైకి వచ్చింది. ఈనెల 15న దుబాయ్‌ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ భేటీలో పీసీబీకి ఆసియా కప్‌ 2023 వన్డే ఫార్మాట్‌ నిర్వహణ  బాధ్యతలను అప్పచెబుతూ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. వాస్తవానికి 2020లోనే ఆసియా కప్‌ను పాక్‌లో నిర్వహించాల్సి ఉండింది. అయితే అప్పట్లో పాక్‌ పర్యటనకు బీసీసీఐ ససేమిరా అనడంతో పీసీబీ ఆ బాధ్యతలను శ్రీలంకకు కట్టబెట్టింది. 

కరోనా కారణంగా శ్రీలంక కూడా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని చేతులెత్తేయడంతో అప్పట్లో టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా జరిగిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ భేటీలో పాక్‌ 2023 ఆసియా కప్‌ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ నూతన చైర్మన్‌ రమీజ్‌ రాజా దృవీకరించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని వారు సంయుక్తంగా ప్రకటిం​చారు. అన్నీ సజావుగా సాగితే టోర్నీని 2023 జూన్‌, జులై మాసాల్లో నిర్వహించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాగా, టీమిండియా చివరిసారిగా 2006లో పాక్‌లో పర్యటించింది. ఆ తర్వాత భారత్‌-పాక్‌ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో పాక్‌ వెలుపల జరిగిన ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడ్డాయి. 
చదవండి: నువ్వు కాకపోతే ఇంకొకరు.. పంత్‌కు కోహ్లి వార్నింగ్‌..!

మరిన్ని వార్తలు