Under-19 Women cricket: సిరీస్‌ భారత మహిళల సొంతం

3 Jan, 2023 06:18 IST|Sakshi

ప్రిటోరియా: దక్షిణాఫ్రికా మహిళల (అండర్‌–19)తో జరిగిన టి20 సిరీస్‌లో భారత మహిళలు (అండర్‌–19) పైచేయి సాధించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకున్నారు. సోమవారం జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ టీమ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 86 పరుగులే చేయగలిగింది.

కేలే రెనెకే (18) టాప్‌ స్కోరర్‌గా నిలవగా...భారత బౌలర్లలో నజీలా సీఎంసీ (3/4), ఫలక్‌ నాజ్‌ (2/11) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. అనంతరం భారత్‌ 15 ఓవర్లలో 6 వికెట్లకు 87 పరుగులు సాధించింది. కెప్టెన్‌ షఫాలీ వర్మ (27 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ గెలవగా, తర్వాతి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సిరీస్‌లో చివరి మ్యాచ్‌ రేపు జరుగుతుంది.  

>
మరిన్ని వార్తలు