World Cup 2023: వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పిచ్‌కు ఐసీసీ రేటింగ్‌.. ఎంతంటే?

8 Dec, 2023 15:18 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ పోరులో భారత్‌ను ఓడించి ఆరోసారి విశ్వవిజేతగా ఆసీస్‌ నిలిచింది. ఈ మెగా టోర్నీలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మొట్టుపై బోల్తా పడింది. ఇ‍క ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తాజాగా ఫైనల్, సెమీఫైనల్ కు మ్యాచ్ లు జరిగిన పిచ్ లకు రేటింగ్ ఇచ్చింది.

నవంబర్‌ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా పిచ్ కు యావరేజ్ రేటింగ్ పాయింట్లు ఇచ్చింది.  పిచ్‌ చాలా మందకొడిగా ఉన్నట్లు పేర్కొంది. అయితే అవుట్‌ ఫీల్డ్‌ మాత్రం ‘చాలా బాగుంది’ అని ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ వెల్లడించారు. కాగా ఫైనల్‌ మ్యాచ్‌ పిచ్‌పై టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్‌ చేయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌటైంది. అయితే సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండడంతో ఆసీస్‌కు బ్యాటింగ్‌ సులభమైంది. ఇక భారత్‌, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ పిచ్ కు గుడ్ రేటింగ్ దక్కింది. ఆ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్ ఈ రేటింగ్‌ ఇచ్చారు. 

అయితే రెండో సెమీఫైన‌ల్‌కు వేదికైన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌కు కూడా ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది.  రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌లో ఆసీస్‌ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 212 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆస్ట్రేలియా కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు 47.2 ఓవర్లు తీసుకోవాల్సి వచ్చింది.  వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఆడిన 11 మ్యాచ్ లలో ఐదు మ్యాచ్ల పిచ్ లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ వచ్చింది.
చదవండి: IPL 2024-Mohammed Shami: గుజరాత్‌ టైటాన్స్‌కు షమీ గుడ్‌బై..?

>
మరిన్ని వార్తలు