WrestlersProtest: '45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే వేటు తప్పదు'

31 May, 2023 09:26 IST|Sakshi

స్విట్జర్లాండ్‌: భారత స్టార్‌ రెజ్లర్లపై పోలీసు చర్యను ప్రపంచ రెజ్లింగ్‌ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) తీవ్రంగా ఖండించింది. టాప్‌స్టార్లపై పోలీసు జులుంపై విచారం వ్యక్తం చేసింది. తమ సమాఖ్య కొన్ని నెలలుగా భారత్‌లోని రెజ్లర్ల నిరసన కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోందని తెలిపింది.

లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఒలింపిక్, ఆసియా క్రీడల పతక విజేతలు సాక్షి మలిక్, వినేశ్‌ ఫొగాట్, బజరంగ్‌ పూనియా తదితరులు చేస్తున్న నిరసన తమ దృష్టికి వచ్చిందని యూడబ్ల్యూడబ్ల్యూ ఈ సందర్భంగా తెలిపింది.

గతంలో ప్రకటించినట్లుగా 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోతే సస్పెన్షన్‌ వేటు తప్పదని ఈ సందర్భంగా ప్రపంచ సమాఖ్య హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు