IND Vs BAN: ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ.. మైదానంలోనే డ్యాన్స్‌ చేసిన కోహ్లి! వీడియో వైరల్‌

11 Dec, 2022 12:51 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ అద్బుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో తొలి సెంచరీనే ద్విశతకంగా మార్చుకున్న ఏకైక క్రికెటర్‌గా కిషన్‌ నిలిచాడు. అదే విధంగా వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా కూడా ఈ జార్ఖండ్‌ డైన్‌మేట్‌ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న కిషన్‌ 23 ఫోర్లు, 10 సిక్స్‌లతో  210 పరుగులు చేశాడు. కాగా ఇషాన్‌ తన డబుల్‌ సెంచరీనీ కేవలం 126 బంతుల్లోనే  సాధించాడు.

డ్యాన్స్‌ చేసిన కోహ్లి..
199 పరుగుల వద్ద కిషన్‌ బ్యాటింగ్‌. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఈ సమయంలో ముస్తిఫిజర్‌ రెహ్మన్‌ వేసిన యార్కర్‌ బంతికి కిషన్‌ సింగిల్‌ తీశాడు. దీంతో అతడు 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో కిషన్‌ ఆనందానికి అవధులు లేవు. గాల్లోకి ఎగురుతూ తన డబుల్‌ సెంచరీ సెలబ్రేషన్స్‌ను ఇషాన్‌ జరుపుకున్నాడు. ఇక స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు డగౌట్‌లో భారత ఆటగాళ్లు, సిబ్బంది చప్పట‍్లతో కిషన్‌ను అభినందించారు.

ఈ క్రమంలో నాన్‌ స్ట్రైకర్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి మాత్రం తనదైన శైలిలో అభినందనలు తెలిపాడు. విరాట్‌.. కిషన్‌తో ‍కలసి డ్యాన్స్‌ చేస్తూ సంబరాలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి కూడా సెంచరీతో మెరిశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత వన్డేల్లో విరాట్‌ సెంచరీ సాధించాడు.


చదవండిAUS vs WI: 77 పరుగులకే కుప్పకూలిన విండీస్‌.. 419 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు