సచిన్‌ రికార్డును అధిగమించిన కోహ్లి

2 Dec, 2020 10:38 IST|Sakshi
బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా కెప్టెన్‌ కోహ్లి

కాన్‌బెర్రా: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లి ఈ ఫీట్‌ సాధించాడు. సచిన్‌ 300 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని దాటగా... కోహ్లి తన 242వ ఇన్నింగ్స్‌లోనే దీనిని అందుకున్నాడు. 

వన్డేల్లో సచిన్‌ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. 463 వన్డేలు ఆడిన సచిన్‌ 18,426 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్‌ పరంగా వేగంగా 11 వేలు, 12 వేలు పరుగులు సాధించిన ఘనత కూడా కోహ్లి పేరిట ఉంది. 222 ఇన్నింగ్స్‌లోనే 11 వేల పరుగుల మైలు రాయిని కోహ్లి అందుకున్నాడు. 2008లో శ్రీలంకతో జరిగిన వన్డేలో అరంగ్రేటం అతడు ఇప్పటివరకు 43 సెంచరీలు, 59 అర్ధసెంచరీలు చేశాడు.

కాగా కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ మైదానంలో టీమిండియా- ఆసీస్‌ మధ్య చివరి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక 64 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 పరుగులు చేసిన కోహ్లి ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.

మరిన్ని వార్తలు