PSL 2023: కోపంతో ఊగిపోయిన పాకిస్తాన్‌ దిగ్గజం.. సోఫాను తన్నుతూ! వీడియో వైరల్‌

23 Feb, 2023 15:26 IST|Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో  కరాచీ కింగ్స్ మరో ఓటమి చవి చూసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  కరాచీ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కరాచీ పరాజాయం పాలవ్వడంతో ఆ జట్టు ప్రెసిడెంట్, పాకిస్తాన్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ తన సహానాన్ని కోల్పోయాడు.

తమ జట్టు ఓటమిపాలైన వెంటనే అక్రమ్‌ తన ముందు ఉన్న సోఫాను బలంగా తన్నాడు. అతడి చర్య అక్కడ ఉన్న కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  తొలుత బ్యాటింగ్‌ చేసిన  ముల్తాన్ సుల్తాన్స్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ముల్తాన్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.  ఈ మ్యాచ్‌లో 64 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్‌..10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. దీంతో కరాచీ కింగ్స్‌ మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సింది. ఇక ఇప్పటివరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన కరాచీ.. ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజాయం పాలైంది.

చదవండి: BGT 2023: ఆసీస్‌తో సిరీస్‌.. టీమిండియా క్రికెటర్‌ తండ్రి కన్నుమూత

మరిన్ని వార్తలు