-

Wisden Cricket Awards: సూర్య, హర్మన్‌ల ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డు

18 Apr, 2023 18:54 IST|Sakshi

టీమిండియా టి20 స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌,  మహిళల కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రతిష్టాత్మక విజ్డెన్‌ క్రికెటర్‌ అవార్డును గెలుచుకున్నారు. గతేడాది టి20 క్రికెట్‌లో సూపర్‌ ప్రదర్శనతో అదగొట్టినందుకు గాను సూర్యకుమార్‌ విజ్డన్‌ అ‍ల్మానిక్‌ లీడింగ్‌ టి20 క్రికెటర్‌ ఇన్‌ వరల్డ్‌ అవార్డు గెలుచుకోగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ విజ్డెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా  నిలిచింది. తద్వారా విజ్డన్‌ అవార్డు గెలిచిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.

2022 ఏడాదిలో సూర్యకుమార్‌ టి20 క్రికెట్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. 2022 ఏడాదిలో 187.43 స్ట్రైక్‌రేట్‌తో సూర్య 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్‌ సెంచరీలు ఉండగా.. 68 సిక్సర్లు బాదాడు. సూర్య బ్యాటింగ్‌ మాయాజాలంతో టీమిండియా 40 మ్యాచ్‌ల్లో 28 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక నాటింగ్‌హమ్‌ వేదికగా జరిగిన టి20 మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్యకు టి20ల్లో తొలి శతకం.

ఇక హర్మన్‌ప్రీత్‌ గతేడాది కెప్టెన్‌గానే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టింది. వన్డేల్లో 754 పరుగులు, టి20ల్లో 524 పరుగులు సాధించింది. ఇంగ్లండ్‌పై వన్డే మ్యాచ్‌లో 143 పరుగులు నాటౌట్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేసింది. ఇక కెప్టెన్‌గా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించింది.

ఇక మరిన్ని అవార్డుల విషయానికి వస్తే.. గతేడాది టెస్టుల్లో టాప్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌ స్టో ఔట్‌స్టాండింగ్‌ టెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచుకోగా.. ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వరుసగా మూడోసారి లీడింగ్‌ క్రికెటర్‌ ఇన్‌ ది వరల్డ్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు.

గతేడాది బెన్‌ స్టోక్స్‌ నాయకత్వంలో 10 టెస్టుల్లో తొమ్మిదింటిలో గెలవడం విశేషం. అలాగే 2022 టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌పై కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్‌ బెత్‌ మూనీ వరల్డ్‌ టాప్‌ వుమెన్స్‌ క్రికెటర్‌ అవార్డును రెండోసారి కొల్లగొట్టింది.

మరిన్ని వార్తలు