WPL 2023: హై స్కోరింగ్‌ మ్యాచ్‌ల కోసం ఇంత దిగజారాలా?

5 Mar, 2023 11:40 IST|Sakshi

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023)G తొలి ఎడిషన్‌ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శనివారం(మార్చి 4న) గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ వుమెన్స్‌ 143 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. హర్మన్‌ప్రీత్‌ 14 ఫోర్లతో 35 బంతుల్లోనే 65 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడింది. హేలీ మాథ్యూస్‌ నాలుగు సిక్సర్లతో 31 బంతుల్లోనే 47 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జెయింట్స్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. పూర్తి ఓవర్లు ఆడకుండానే 64 పరుగులకే కుప్పకూలింది.

అయితే సాధారణంగా అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో బౌండరీ లైన్‌ను కాస్త ముందుకు జరపడం చూస్తుంటాం. ఐపీఎల్‌లోనూ ఇదే తంతు కొనసాగుతుంది. కేవలం పెద్ద స్కోర్లు రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తుంటారు. అయితే డబ్ల్యూపీఎల్‌ విషయంలో బీసీసీఐ మరింత ముందుకెళ్లింది. హై స్కోరింగ్‌ మ్యాచ్‌లు నమోదవ్వాలనే ఉద్దేశంతో బౌండరీ లైన్‌ను బాగా తగ్గించేసింది.

కేవలం 60 మీటర్ల దూరంలోనే బౌండరీ లైన్‌ను ఉంచింది. అందుకే ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో బ్యాటర్లు అవలీలగా బౌండరీలు కొట్టేశారు. ఒక్క హర్మన్‌ప్రీత్‌ ఏకంగా 14 బౌండరీలు బాదగా.. మాథ్యూస్‌ అయితే నాలుగు సిక్సర్లు కొట్టిపారేసింది. అయితే చేధనలో చతికిలపడ్డ గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో బౌండరీలు ఎక్కువగా రానప్పటికి వాళ్లు కూడా బంతులను అవలీలగా బౌండరీ దాటించేశారు.

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కేవలం 60 మీటర్ల దూరంలోనే బౌండరీని ఏర్పాటు చేసింది. ఇటీవలే ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్‌లో బౌండరీ లైన్‌ను 65 మీటర్ల దూరంలో ఉంచారు. బౌండరీలైన్‌ను తగ్గించడం ద్వారా హై స్కోరింగ్‌లకు ఎక్కువ అవకాశం ఉంటుందని.. మ్యాచ్‌ చూస్తే అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని బీసీసీఐ పేర్కొంది. అయితే బీసీసీఐ చేసిన పనిని కొంతమంది తప్పుబట్టారు. హైస్కోరింగ్‌ మ్యాచ్‌ల కోసం ఇంత దిగజారుతారా అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: సీఎస్‌కే కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్!?

WPL 2023: క్రికెటర్‌పై వేటు.. ఆరంభంలోనే వివాదం

మరిన్ని వార్తలు