Pro Kabaddi League 2022: సెమీఫైనల్స్‌కు యూపీ యోధ, బెంగళూరు బుల్స్‌

22 Feb, 2022 07:42 IST|Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో యూపీ యోధ, బెంగళూరు బుల్స్‌ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరాయి. సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో యూపీ యోధ 42–31తో పుణేరి పల్టన్‌పై గెలుపొందగా, బెంగళూరు బుల్స్‌ 49–29తో గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభంలో అస్లామ్, మోహిత్‌ గోయత్‌ రెయిడింగ్‌ పాయింట్లతో పుణేరి 5–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడో నిమిషంలో యూపీ ఆలౌటైంది. తర్వాత పర్దీప్‌ వరుసగా కూతకు వెళ్లి పాయింట్లు తెచ్చిపెట్టడంతో పుంజుకుంది.

స్టార్‌ రెయిడర్‌ పర్దీప్‌ 18 పాయింట్లతో రాణించాడు. ప్రత్యర్థి పుణేరి జట్టులో అస్లామ్‌ ఇనామ్‌దార్‌ (10) మెరుగనిపించాడు. రెండో ఎలిమినేటర్‌ పోరులో బెంగళూరు సమష్టిగా రాణించింది. రెయిడర్లు పవన్‌ 13, భరత్‌ 6, రంజీత్‌ చంద్రన్‌ 7 పాయింట్లు సాధించగా, డిఫెండర్లు మహేందర్‌ సింగ్‌ 5, సౌరభ్‌ నందల్‌ 4, అమన్‌ 4 పాయింట్లు చేశారు. గుజరాత్‌ జట్టులో రాకేశ్‌ (8), మహేంద్ర రాజ్‌పుత్‌ (5) మెరుగనిపించారు. బుధవారం జరిగే సెమీఫైనల్లో యూపీ... పట్నా పైరేట్స్‌తో, బెంగళూరు... దబంగ్‌ ఢిల్లీతో తలపడతాయి. 

మరిన్ని వార్తలు