కదిరి టౌన్‌:.....

30 Mar, 2023 00:44 IST|Sakshi
వనజ మృతదేహం

కదిరి టౌన్‌: మూడు ముళ్లు... ఆమె పాలిట మృత్యుపాశమయ్యాయి. అనుమానం పెనుభూతం కాగా, జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే కాలయముడయ్యాడు. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన యువతిని గొంతునులిమి హత్య చేశాడు. ఈ సంఘటన బుధవారం కదిరి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల వివరాల మేరకు... తనకల్లు మండలం బండకడపల్లికి చెందిన ఆంజనేయులుకు మూడు నెలల క్రితం నల్లమాడ మండలం దొన్నికోటకు చెందిన వెంకటరమణ కుమార్తె వనజతో వివాహమైంది. నూతన దంపతులు కదిరి వాణీస్ట్రీట్‌లో కాపురం ఉంటున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు సూటిపోటి మాటలతో నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే వనజతో తరచూ గొడవపడేవారు. బుధవారం కూడా భార్యతో గొడవపడిన ఆంజనేయులు మాటామాటా పెరగడంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వనజ మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో బంధువులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకుని ఆస్పత్రి వద్దకు వచ్చిన బంధువులు విగతజీవిగా ఉన్న వనజను చూసి బోరున విలపించారు. గొంతు కింద గాయాలున్నాయని, ఆమె భర్త ఆంజనేయులే హత్య చేశాడని ఆరోపించారు. మృతురాలు తండ్రి వెంకటరమణ మాత్రం కట్నం కోసం వేధించేవాడని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మధు తెలిపారు.

అనుమానంతో భార్యను

గొంతునులిమి చంపిన భర్త

వివాహమైన మూడు నెలలకే ఘాతుకం

మరిన్ని వార్తలు