కదిరి/పుట్టపర్తి అర్బన్: ‘ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలకూ మేలు చేస్తూ రాష్ట్రంలో జనరంజక పాలన సాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనది పేదల పక్షం..ప్రతిపక్ష నేత చంద్రబాబుది పెత్తందార్ల పక్షం. అందువల్లే ప్రజలు జగన్ పక్షాన ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవడం ఖాయం..మళ్లీ సీఎం పీఠాన్ని జగన్ అధిష్టించడం ఖాయం’ అని ఏపీ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఎన్నికలకు మునుపు ప్రజలకిచ్చిన హామీలన్నీ దాదాపుగా నెరవేర్చారన్నారు. పాలనను ప్రజల ముంగిటకే తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. విశాఖను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తున్నారని, అందువల్లే ఎన్నో కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయన్నారు.
చంద్రబాబు తప్పుకుంటే మంచిది
‘‘స్కిల్ స్కాం కేసులో జైలుకెళ్లి కంటి ఆపరేషన్ కోసం బెయిల్పై బయటకొచ్చిన టీడీపీ అధనేత చంద్రబాబుకు ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలున్నాయని ఆయన అనుకూల మీడియాతో పాటు కొందరు టీడీపీ నాయకులు చెబుతున్నారు. వారి మాట ప్రకారం చంద్రబాబుకు ఇక పూర్తిగా విశ్రాంతి ఇస్తే మంచిది. ఆయన ఆరోగ్యరీత్యా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది’’ అని కొమ్మినేని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అనంతరం కొమ్మినేనిని స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డితో పాటు పాత్రికేయులు కలిసి ఘనంగా సన్మానించారు.
లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.2.50 లక్షల కోట్లు
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల ద్వారా రూ.2.50 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు చేర్చిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందని కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన పుట్టపర్తిలో సత్యసాయి మహాసమాఽధిని దర్శించుకున్నారు. అనంతరం కలెక్టరేట్లోని వీసీ హాలులో విలేకరులతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధికి సీఎం జగన్ సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అధికారం చేపట్టగానే 1.50 లక్షల ఉద్యోగాలిచ్చారని, అలాగే మరో 2.5 లక్షల మందిని వలంటీర్లుగా నియమించి ఉపాధి కల్పించారన్నారు. ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్దేనన్నారు. సచివాలయాలు, ఆర్బీకేల ద్వారా రైతుల, ప్రజల అవసరాలను తీరుస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, ట్యాబ్ల అందజేత, అమ్మ ఒడి వంటి పథకాలు అర్హులందరికీ అందజేశారన్నారు. అలాగే 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారన్నారు. కొమ్మినేని వెంట జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు అవుటాల రమణారెడ్డి, సమాచార శాఖ ఏడీ వేలాయుధం, మీడియా అకాడమీ ఓఎస్డీ శ్రీనివాస్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ పేదల పక్షం..
పెత్తందార్లకే చంద్రబాబు మద్దతు
రాజకీయాల నుంచి
బాబు తప్పుకుంటే ఉత్తమం
ఏపీ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు