ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్‌ నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు

28 Jun, 2023 09:18 IST|Sakshi

సాక్షి, జఫర్‌గఢ్‌: స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య పై ధర్మసాగర్‌ మండలం జానకిపురం సర్పంచ్‌ నవ్య చేసిన ఆరోపణలపై నిజానిజాల ఆధారంగా ప్రభుత్వం, పార్టీపరంగా చర్యలు ఉంటాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొ న్నారు. ఆయన జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ నవ్య చేసిన ఆరోపణలను ఓ విలేకరి ప్రస్తావించగా.. శ్రీహరి సమాధానమిస్తూ.. రాజయ్యపై వచ్చిన ఆరోపణలపై పోలీసు విచారణ జరుగుతోందని చెప్పారు విచారణలో తేలిన అంశాల ఆధారంగా పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలుంటాయని పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజయ్య వేధింపులపై ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు జానకిపురం సర్పంచ్ నవ్య. ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య, సరైన ఆధారాలతో రేపు మహిళా కమిషన్‌ను కలుస్తానని తెలిపారు. బెదిరింపు కాల్స్, అసభ్యకరంగా మాట్లాడే కాల్స్ వస్తున్నాయని చెప్పారు.

ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీపీ కవితతో తనకు ప్రాణహాని ఉందని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరారు. తాను ఏ తప్పు చేయలేదని, నిజాయితీగా పోరాడతానని స్పష్టం చేశారు. ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారికి గుణపాఠం కావాలనే తాను పోరాడతానని నవ్య చెప్పారు. ఎమ్మెల్యే వేధించిన ఆధారాలు అవసరమైనప్పుడు బయటపెడతానని తెలిపారు.

ఇది కూడా చదవండి:  తెలంగాణలో ఐదు జిల్లాలపై సర్కార్‌ ఫోకస్‌.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు! 

మరిన్ని వార్తలు