31.29 గంటల్లో 72 కి.మీ. ఈత!

22 Jul, 2023 02:35 IST|Sakshi

ఇంగ్లిష్‌ చానల్‌ను రెండు వైపులా రిలేగా ఈదిన భారత పారా స్విమ్మర్లు

ఆరుగురు సభ్యుల బృందంలో హైదరాబాద్‌వాసి శివకుమార్‌

కాచిగూడ: భారత్‌కు చెందిన ఆరుగురు దివ్యాంగ ఈతగాళ్లు ఇంగ్లండ్‌–ఫ్రాన్స్‌ మధ్య ఉన్న ఇంగ్లిష్‌ చానల్‌ (అట్లాంటిక్‌ మహాసముద్రంలోని ఓ భాగం)ను రెండు వైపులా రిలేగా ఈది సరికొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్‌కు చెందిన కోచ్‌ రాజోరియా తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగుడు శివకుమార్‌తోపాటు ఎన్‌ఏ స్నేహన్‌ (తమిళనాడు), ఎల్విస్‌ అలీ హజారికా (అస్సాం), రిమో సాహా (పశ్చిమ బెంగాల్‌), సత్యేంద్రసింగ్‌ (మధ్యప్రదేశ్‌), జయంత్‌ దూబ్లే (మహారాష్ట్ర)తో కూడిన బృందం ఇంగ్లిష్‌ చానల్‌ ఈదడానికి ఈ నెల 8న లండన్‌కు వెళ్లారు.

ఈ నెల 18న కెంట్‌లోని డోవర్‌లో సమీపంలో ఉన్న షేక్‌స్పియర్‌ బీచ్‌ నుంచి ఈత ప్రారంభించి ఉత్తర ఫ్రాన్స్‌లోని విస్సంట్‌ ఒడ్డును చేరుకొని తిరిగి డోవర్‌ వద్ద ఉన్న ఓల్డ్‌ సౌత్‌ ఫోర్‌ల్యాండ్‌ లైట్‌హౌస్‌ వద్దకు ఈ నెల 19న చేరుకున్నారు. భారీ అలలు, జెల్లీఫిష్‌లు సహా ఇతర ప్రమాదకర సముద్ర జీవుల నుంచి తప్పించుకుంటూ మొత్తం 72 కి.మీ. దూరాన్ని కేవలం 31 గంటల్లోనే ఈదారు. తద్వారా ఇంగ్లిష్‌ చానల్‌ను రిలేగా ఈదిన ఆసియా ప్రాంత వాసులుగా రికార్డు సృష్టించారు.

మరిన్ని వార్తలు