‘బి–పోస్ట్‌’ ఆవిష్కరణ

7 Aug, 2020 04:11 IST|Sakshi

సులభతరం కానున్న రుణ వితరణ, చెల్లింపులు

1.5 లక్షల ఎస్‌హెచ్‌జీ మహిళలకు ప్రయోజనం

సాక్షి, హైదరాబాద్‌: స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఐటీ విభాగం ఎమర్జింగ్‌ టెక్నాలజీ బ్లాక్‌చెయిన్‌తో రూపొందించిన ‘బ్లాక్‌చెయిన్‌ – ప్రొటెక్షన్‌ ఆఫ్‌ స్త్రీ నిధి ట్రాన్జాక్షన్స్‌’(బీ–పోస్ట్‌)ను గురువారం ప్రారంభించారు. ఈ విధానం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.5 లక్షల మంది సంఘాలకు చెందిన మహిళలు ‘స్త్రీ నిధి’ద్వారా మంజూరయ్యే రుణాలకు క్రెడిట్‌ రేటింగ్‌ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి రుణాలు పొందే వీలు కలుగుతుంది. హైదరాబాద్‌కు చెందిన కాగ్నిటోచెయిన్‌ అనే స్టార్టప్‌ ‘బీ పోస్ట్‌’ను ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఈవిధానంతో రుణవితరణ, చెల్లింపులు సులువు కానున్నాయి.

పౌరసేవల్లో టెక్నాలజీ వినియోగం: జయేశ్‌ రంజన్‌ 
పౌర సేవలను అందించే టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అ న్నారు. పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాతో కలిసి గురువారం ఆయన బీ–పోస్ట్‌ను ఆవిష్కరించారు. బ్యాంకు లావాదేవీలపై అవగాహన లేని నిరుపేద మహిళలకు బీ పోస్ట్‌ ద్వారా సమర్థవంతంగా సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో స్త్రీ నిధి రూరల్‌ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు