ఇది కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనం.. దేవుడు కూడా బీఆర్‌ఎస్‌ ఓటమిని ఆపలేడు: ఈటల

21 Feb, 2023 14:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల విషయంలో దుమారం రేగిన తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరిపించని పరిణామంపై ఆయన అనుచరులు నిన్న(సోమవారం) స్మశానంలో నిరసన వ్యక్తం చేయగా.. మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జోక్యంతో అధికారిక లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు జరిగాయి. తాజాగా ఈ పరిణామంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. 

సాయన్న అంత్యక్రియలు అధికారికంగా జరపకపోవడం.. కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనమని ఈటల పేర్కొన్నారు. ఫ్యూడల్‌ మనస్తత్వంతో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ సర్కార్‌ను దేవుడు కూడా కాపాడలేడని, బీజేపీ గెలుపుఖాయమని ఎమ్మెల్యే ఈటల జోస్యం పలికారు. 

అన్ని వర్గాలను కేసీఆర్ మోసగించారు. ఏడేళ్లుగా దళితులకు ఒక్క ఎకరం భూమిని కూడ ఇవ్వకుండా దళితులను  కేసీఆర్ మోసగించాడు.ధరణీ పేదల కొంపముంచింది.. పేదలను బిక్షగాళ్లుగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కార్ ది. 2018 నుంచి ఇప్పటి వరకు మహిళా సంఘాలకు రావాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వటం లేదు. రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులు బ్యాంకులకు ఎగరవేతదారులుగా మారటం కేసీఆర్ పుణ్యమే!. మద్యం విపరీత అమ్మకాలతో ఎంతో మంది మహిళల పుస్తెలతాడులు తెగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే ఈటల తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు