నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్లు.. ‘ఒలింపిక్స్‌’ శిక్షణ కోసం సీఎం కేసీఆర్‌ సాయం

19 May, 2023 08:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ రాబోయే ఒలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణపతకాన్ని సాధించి తెలంగాణతోపాటు భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. నిఖత్‌ జరీన్‌కు రాబోయే ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో నిఖత్‌ జరీన్, సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రూ.2 కోట్లను ప్రకటించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్‌ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిఖత్‌ జరీన్‌ను సందీప్‌ కుమార్‌ సుల్తానియా  సచివాలయంలోని తన చాంబర్‌లో నిఖత్‌కు శాలువా కప్పి సత్కరించారు.

చదవండి: లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్‌ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు!

మరిన్ని వార్తలు