నేటి నుంచి జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్‌ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

30 Mar, 2021 14:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క‌ఠిన చ‌ర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ముఖానికి మాస్క్‌ ధరించకుండా రోడ్లపై, వాహనాల్లో తిరిగే వారిని ఫోటోలు తీసి జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందుకు నేటి(మంగళవారం) నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవ‌రైనా బ‌య‌ట క‌నిపిస్తే వారికి భారీ జ‌రిమానా విధించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నడుం బిగించారు.

మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు మాస్క్‌ లేకుండా వెళ్తున్నవారి ఫోటోలు తీసి వాహనం నంబరు ఆధారంగా ఇంటికి ఈ-చలానాలను పంపనున్నారు. జరిమానా ఎంత విధించాలనేది మాత్రం ఇంక నిర్ణయించలేదు. ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే మాస్కులు లేకుండా వాహనాల్లో వెళ్తున్న వారిపై హైదరబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు 15 వేల కేసులు నమోదు చేశారు. కాగా మాస్కులు లేకుండా ఉన్న వారిని గుర్తించడంలో ట్రాఫిక్‌ పోలీసులతోపాటు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రధానపాత్ర పోషించనున్నాయి.


 

చదవండి: మాస్కులేకుండా విధుల్లో సీఐ.. గుంటూరు ఎస్పీ ఏం చేశారంటే!

>
మరిన్ని వార్తలు