వైద్యుల నిర్లక్ష్యం.. గ్యాస్‌ ట్రబుల్‌తో వస్తే ప్రాణం పోయింది!

21 Mar, 2022 11:29 IST|Sakshi

మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన 

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ 

వైద్యుడిపై చర్య తీసుకోవాలని ఆస్పత్రి ఎదుట ఆందోళన 

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

సాక్షి,మంచిర్యాల: కొన్నేళ్లుగా గ్యాస్‌ ట్రబుల్‌తో బాధపడుతు న్న ఓ యువకుడికి శనివారం తీ వ్రమైన కడుపు నొప్పి రావడంతో చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆ స్పత్రికి వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు 12 గంటలు అబ్జర్వేషన్‌లో ఉండాలని సూ చించారు. మరుసటి రోజు ఉదయం వరకు బాగానే ఉన్న యువకుడు డిశ్చార్జి చేసే సమయానికి ఫిట్స్, హార్ట్‌ స్ట్రోక్‌తో కుప్ప కూలాడు. చికిత్స అందించేలోపే మృతిచెందాడు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన చెన్న వెంకటేశ్‌(30) కొంతకాలంగా గ్యాస్‌ ట్రబుల్‌తో బాధపడుతున్నాడు. శనివారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేసి ప్రధాన సమస్య ఏమీ లేదని తెలిపారు. ఒకరోజు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించి అడ్మిట్‌ చేసుకున్నారు. రాత్రంత వైద్యం అందించారు. ఆదివారం ఉదయం బాగానే ఉన్నాడు. మరోసారి పరీక్షించిన వైద్యులు ఇంటికి వెళ్లొచ్చని తెలిపారు. గంట తర్వాత డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ఇంతలో వెంకటేశ్‌కు ఫిట్స్‌తో పాటు, గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వైద్యులు చికిత్స అందించేలోపే మృతిచెందాడు. వెంకటేశ్‌కు భార్య అలేఖ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

బంధువుల ఆందోళన.. 
వెంకటేశ్‌ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యం పేరిట ప్రయోగాలు చేశారని, మందులు ఓవర్‌ డోస్‌ ఇవ్వడంతోనే మృతిచెందాడని ఆరోపించారు. వెంకటేశ్‌ మృతికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  దీంతో ఉద్రిక్తి వాతారవణం నెలకొంది. సమాచారం అందుకున్న సీఐ నారాయణ్‌నాయక్, ఎస్సై ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. రాతపూర్వకంగా ఫిర్యా దు చేస్తే చర్య తీసుకుంటామని తెలిపారు.

తర్వాత బాదితుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపినట్లు తెలిసింది. బాధిత కుటుంబానికి న్యాయంచేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, వెంకటేశ్‌ మృతిపై తమకు ఫిర్యాదు అందలేదని సీఐ నారాయణ్‌నాయక్‌ తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి వైద్యుడు శ్రావణ్‌ను వివరణ కోరగా వెంకటేశ్‌ బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తుండగా ఫిట్స్, హార్ట్‌స్ట్రోక్‌తో కుప్పకూలాడని తెలిపారు. తాము అందించిన చికిత్సలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు.

  

మరిన్ని వార్తలు