తనిఖీల జప్తులో తెలంగాణ టాప్‌.. ఏకంగా 659 కోట్ల స్వాధీనం

21 Nov, 2023 07:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి జరుగుతున్న తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా చేస్తున్న తనిఖీల్లో రూ.1,760 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తెలిపింది. 2018లో స్వాధీనం చేసుకున్న రూ.239.15 కోట్లతో పోలిస్తే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న సంపద 7 రెట్లు ఎక్కువ అని పేర్కొంది.

సోమవారం వరకు తెలంగాణలో రూ.225.23 కోట్ల నగదు, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.191.02 కోట్ల విలువైన బంగారం సహా విలువైన లోహాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితాలకు సంబంధించిన వస్తువులతో కలిపి మొత్తం రూ.659.20 కోట్ల విలువైన సంపదను పట్టుకున్నట్లు సీఈసీ వెల్లడించింది. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉచితాలు మినహా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారంలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతో పోలిస్తే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.

రాజస్తాన్‌లో రూ.650.70 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.323.70 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.76.9 కోట్లు, మిజోరంలో రూ.49.6 కోట్లు పట్టుబడినట్లు ఈసీ తెలిపింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వినియోగించే ఉచితాలకు సంబంధించిన వస్తువుల జప్తు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధికంగా ఉంది. రాజస్తాన్‌లో రూ.341.24 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.120.53 కోట్ల విలువైన ఉచితాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఈసారి ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ విధానం.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సులభతరం చేసిందని ఈసీ పేర్కొంది. 

మరిన్ని వార్తలు