రూ.90తో మొదలై.. రూ.250 కోట్లకు!

31 Mar, 2022 07:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్‌ జరిమానా బకాయిలను భారీగా తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్‌ అదాలత్‌ ఈ నెల 1న మొదలైంది. ఆ రోజు తెల్లవారుజామున 1.24 గంటలకు ఓ వాహనదారు తన ద్విచక్ర వాహనంపై ఉన్న జరిమానా మొత్తంలో రిబేటు పోను రూ.90 చెల్లించారు. ఇదే ఈ– లోక్‌ అదాలత్‌కు సంబంధించిన తొలి చెల్లింపు. ఇలా మొదలైన చెల్లింపులు బుధవారం నాటికి రూ.250 కోట్లకు చేరాయి.

తొలుత ప్రకటించిన దాని ప్రకారం గురువారంతో ఈ– లోక్‌ అదాలత్‌ ముగియనున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా పేరుకు పోయిన ఈ–చలాన్‌ బకాయిలు రూ.1700 కోట్ల వరకు ఉన్నాయి. బుధవారం వరకు 2.57 కోట్ల చలాన్లకు సంబంధించి రూ.250 కోట్లను వాహనచోదకులు చెల్లించారు.

ఈ స్కీమ్‌ ప్రారంభమైన తొలినాళ్లల్లో రోజువారీ చెల్లింపులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా... సోమవారం నుంచి ఇది రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ– లోక్‌ అదాలత్‌ను  ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్‌ అధికారులు పేర్కొన్నారు.  

ఆన్‌లైన్‌ ద్వారానే రూ.60 కోట్లు.. 
ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్ల చెల్లింపులు అత్యధికంగా పేటీఎం ద్వారా జరిగాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు పేటీఎం, వాలెట్, యూపీఐ, పోస్ట్‌పెయిడ్, నెట్‌బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్‌ కార్డ్‌ల ద్వారా రూ.60 కోట్ల ఈ– చలాన్‌ చెల్లింపులు జరిగాయి.  

(చదవండి: నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు)

మరిన్ని వార్తలు