ఆన్‌లైన్‌లోనే ప్రైవేటు పాఠశాలలకు అనుమతి 

18 Oct, 2023 03:40 IST|Sakshi

ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరి 

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదేశం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు ఆన్‌లైన్‌లో మాత్రమే అనుమతి మంజూరు చేస్తామని, ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పకుండా పా­టిం­చాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురే­ష్‌ కుమార్‌ ఆదేశించారు. దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలు, సూచనలు, సలహాలపై మంగళవారం ప్రై­వే­ట్, అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల­తో సమావేశమయ్యారు.

విజయవాడ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రైవేటు పాఠశాలలకు అనుమతి, గుర్తింపునకు సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా సకాలంలో చలానా చెల్లింపులు, పోర్టల్‌­లో సమస్యలు, ప్రైవేట్‌ ఉపాధ్యాయులు–సిబ్బంది సమ­స్యలు, పీఎఫ్, ఆరోగ్య బీమా, ఈఎస్‌ఐ కార్డు, ఉద్యో­గుల జీతాల చెల్లింపు, గుర్తింపు పొడిగింపు, వార్షిక పరిపాలన నివేదిక, ఫీజులు, అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం పాఠశాల నిర్వహణపై చర్చించారు.

ఇతర సంస్థల ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) వంటివి అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా విద్యాశాఖ పోర్టల్‌ను పునరుద్ధరిస్తామని  కమిషనర్‌ తెలిపారు. ప్రతి ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలకు చెందిన వార్షిక పరిపాలన నివేదికను సంబంధిత విద్యాశాఖాధికారులకు సమర్పించాలని సూచించారు.  ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ పి.పార్వతి, ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ ఉపాధ్యాయినికి అభినందన 
అనకాపల్లి జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి ఈనెల 5 నుంచి 9 వరకు నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సంయుక్త భారతీయ ఖేల్‌ ఫౌండేషన్‌ పోటీల్లో పాల్గొని నాలుగు పతకాలు సాధించారు. ఆమెను ఈ సందర్భంగా సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల విద్య డైరెక్టర్‌ పి.పార్వతి, ఏపీ టెట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మేరీ చంద్రిక, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు